నెత్తురోడిన లక్షింపేట
లక్షింపేట దళితుడు పిడికెడు ఆత్మగౌరవంతో తలెత్తుకొని నిలుచున్నందుకు అగ్రకుల నరమేధానికి గురికావల్సి వచ్చింది. ఈ దేశంలోని దళితులకి ఇలాంటి దాడులు కొత్తేమికాదు. అంటరానితనం అవమానాలు,అణిచివేతలు ఇక్కడి దళితులకి నిత్య అనుభవాలే. కారంచేడు,చుండూరు,తిమ్మసముద్రం,వేంపేంటలలో దళితులపై జరిగిన దాడులను మరువకముందే లక్షింపేట మాలపల్లె అగ్రకుల నరమేధానికి బలైంది. దళితులపై జరుగుతున్న దాడుల్లో ప్రాంతాలు వేరుకావచ్చు. పాత్రదారులు వేరుకావచ్చు. రెండ్లు,కమ్మల స్థానంలో కొత్తగా తూర్పు కాపులు రావొచ్చు కాని దళితులే లక్ష్యంగా సాగుతున్న అగ్రకుల దాడుల్లో ఒకటే తీరు కనిపిస్తుంది. ఆర్థికంగా పైకెదుగుతూ, ఆత్మగౌరవంతో తలెత్తుకొని నిలుచున్న ప్రతిసారి ఆయా సామాజిక వర్గాలు, తమ ఆధిపత్యాన్ని, కుల దురంహకారాన్ని ప్రదర్శించడం కోసం నిరుపేదలైన నిరాయుధులైన దళితులపై దాడులు చేయడం పరిపాటయ్యింది. శ్రీకాకుళం జిల్లా వంగర మండలం లక్షింపేటలో జూన్ 12న జరిగిన సంఘటనని రెండు సామాజిక వర్గాల మధ్య పాత కక్షల వల్ల అనుకోకుండా జరిగిన ఘటనగా పాలక వర్గాలకు వత్తాసు పలుకుతున్న మీడియా ప్రచారం చేస్తుంది. కానీ ఈ నరమేధానికి ఒక ఆర్థిక,సామాజిక నేపథ్యముంది. ముఖ్యంగా ఈ సమస్య భూమి చుట్టూ అల్లుకొని ఉంది. ఉత్తర కోస్తాలో సంఖ్యారీత్యా బలంగా వున్న తూర్పున కాపులు గత పది,పదిహేను ఏండ్లుగా భూమి మీద ఉన్న పట్టుతో రాజకీయంగా అధికారానికి ఎగబాకారు. తూర్పు కాపులు పేరుకి మాత్రమే బి.సిలుగా చెలామణి అవుతున్నా ఆర్థికంగా, రాజకీయంగా బలిసిన కులంగా ఎదిగింది. మరోవైపు సంఖ్యారీత్యా అంతే బలంగా వున్న దళితులు భూమి, అధికారం వంటివి లేకపోయిన ఆత్మగౌరవంతో తలెత్తుకొనే స్థాయిలో ఉన్నారు. రాజ్యంగ పరంగా తమకున్న హక్కులను పోరాటం ద్వారా పరిరక్షించుకోవాలన్న స్పృహ కలిగివున్నారు. దీంట్లో భాగంగానే 2006 ఎన్నికల్లో సర్పంచు సీటు ఎస్సీ మహిళకు రిజర్వు అయితే మాలపల్లె అంతా ఐక్యమత్యంతో చిత్తిరి సింహాలమ్మను ఏకగ్రీవంగా ఎనుకున్నారు. మాలపల్లె ఐక్యమత్యాన్ని, ఆత్మగౌరవాన్ని, జీర్ణించుకోలేని తూర్పుకాపులు కుల దురంహకారంతో బాంబులతో,బరిసెలతో, బండరాళ్లతో,గొడ్డల్లతో దళితులపై పాశవికంగా దాడి చేసి ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు నరమేధానికి ఒడిగట్టారు. మూకుమ్మడిగా చేసిన ఈ డాడికి మాలపల్లె విలవిల లాడింది.
దాడికి అసలు కారణం
వంగర,రేగడి అముదాల వలస, సంతకవిటి, జి.సిగడాం, పొందూరు మండలాల్లో 104 గ్రామాల్లోని 24,700 ఎకరాల సాగుభూమికి నీరందించే ఉద్దేశ్యంతో సువర్ణముఖి,వేగావతి నది సంగమ ప్రాంతంలో మడ్డువలస ప్రాజెక్టును 1976వ సంవత్సరంలో ప్రారంభించారు.ఈ ప్రాజెక్టు కింద 7 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ప్రభుత్వం ముంపునకు గురవుతున్న భూములతోపాటు, నివాసిత గ్రామాలకు నష్టపరిహారం చెల్లించి భూసేకరణ చట్టం కింద భూమిని తీసుకున్నారు. భూములు కోల్పోయిన తూర్పుకాపులకు నష్టపరిహారంగా ఎకరానికి రెండున్నర లక్షలు, గృహాలకు రూ. 50 వేల నుండి రెండు లక్షల వరకు చెల్లించారు. భూములు,ఇళ్లు కోల్పోయిన తూర్పు కాపులకు, మాలలకు ముత్యాలమ్మ ట్యాంకు సమీపంలో (ప్రస్తుతం మాలలు నివాసం ఉంటున్న ప్రాంతం) పునరావాసం కల్పించారు. పునరావాస ప్రాంతానికి మాలలు 2000 సంవత్సరంలో వచ్చి స్థిరపడ్డారు. ఆ తరువాత రెండు సంవత్సరాలకు తూర్పు కాపులు అక్కడి వచ్చి స్థిరపడ్డారు. పునరావసం క్రింద తూర్పు కాపులకు 40 ఉద్యోగాలు ప్రాజెక్టులో ఇచ్చారు కానీ ఒక్క దళితుడికి ఉద్మోగం ఇవ్వలేదు. దళితులకు భూమిలేకపోవడంతో పూరి ఇళ్లు అయినందుకు వారికి రూ.8 వేల నుండి 10 వేల వరకు ఇచ్చారు. కానీ ఈ 8 వేలల్లో కూడా గ్రామంలో గుడి కడతామంటూ గ్రామ కాపులు ప్రతి దళిత కుటుంబం నుంచి 3 వేల రూపాయలను వసూలు చేశారు. అయితే మడ్డువలస ప్రాజెక్టు కోసం సేకరించిన మొత్తం భూమిలో సుమారు 250 ఎకరాల భూమి ముంపునకు గురికాకుండా మిగిలిపోయింది. ఈ భూమి ఖాళీగా ఉండటం వల్ల లక్షింపేట కాపులు 190 ఎకరాలు సాగుచేసుకుంటున్నారు. మిగిలిన 60 ఎకరాలు అలాగే ఉన్నది. అందులో 40 ఎకరాలు పక్క గ్రామమైన దేవకవాడ వాళ్లది. వాళ్లు భూమిని ప్రభుత్వానికి ఇచ్చేసి నష్టపరిహారం తీసుకొని పక్కగ్రామానికి వెళ్లి స్థిరపడిపోయారు. తర్వాత ఆ గ్రామం వైపు ఎప్పుడు తిరిగిచూడలేదు. ఇక మిగిలిన 20 ఎకరాలు లక్షింపేట కాపులవే కానీ ఆ కాపు కుటుంబాలు కూడా ఇప్పుడు అక్కడ లేవు. వారు ఎక్కడికో వెళ్లి స్థిరపడిపోయారు. ఆ 60 ఎకరాల భూమి ఖాళీగా ఉండటంతో గత 12 ఏండ్లుగా లక్షింపేట మాలలు ఒక్కొక్కరు 45 సెంట్ల చొప్పున దీనిని సాగుచేయటం మొదలుపెట్టారు. భూమిని సాగుచేసుకుంటున్నందుకు భూమి శిస్తు కూడా చెల్లిస్తున్నారు. వాస్తవానికి ఈ మొత్తం 250 ఎకరాల మీద లక్షింపేట,దేవకవాడ కాపులకు ఏ సంబంధమూ లేదు. ఎందుకంటే వారు నష్టపరిహారం తీసుకున్నారు కాబట్టి. కాపులు సాగుచేసుకుంటున్న 190 ఎకరాలు, మాలలు సాగుచేసుకుంటున్న 60 ఎకరాలు మొత్తం 250 ఎకరాలు కలిసే ఉంది. లక్షింపేటలో తమ ఇళ్ల పక్కనే మాలల ఇళ్లు ఉండటం, తమతో పాటు మాలలు భూమిని సాగుచేసుకోవడాన్ని, వాళ్లు ఆర్థికంగా ఎదగడాన్ని సహించలేని కాపులు ఏవిధంగానైనా మాలలను ఆ గ్రామం నుంచి తరిమివేయాలని కంకణం కట్టుకున్నారు.
2010 నుంచి మాలలపై జరిగిన దాడులు:
గత రెండేళ్లుగా మాలన్ని ఈ భూమి సాగుచేసుకోవద్దని బెదిరించడం, అడపదడప దాడులకు పాల్పడడం చేస్తున్నారు. 2010లో మాలవాడకు చెందిన దడాసి లత, కలమటి చిన్నమ్మడు ప్రాజెక్టు మిగులు భూమిలో పుల్లలు ఏరుకుంటుండగా తూర్పుకాపులు కర్రలతో దాడిచేసి కులంపేరుతో దూషిస్తూ వారిని కొట్టారు. మాలలు ఈ దాడికి పాల్పడిన తూర్పు కాపులపై వంగర పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికి కేసు రిజిష్టర్ చేయలేదు.
గత సంవత్సరం ఆగస్టు 22వ తేదీన నివర్తి రాముడమ్మ పిడకల కోసం ప్రాజెక్టు భూముల్లో పేడ పోగుచేసుకుంటుండగా తూర్పు కాపులు ఆమెను కులం పేరుతో అసభ్యంగా తిడుతూ కర్రలతో దాడిచేసి తీవ్రంగా కొట్టారు. ఈ దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికి పోలీసులు కేసు నమోదు చేయలేదు. తీవ్రంగా గాయపడిన రాముడమ్మ ఆ తర్వాత మరణించడం జరిగింది.
తూర్పు కాపులకు చెందిన పొలంలో పశువులు పడ్డాయనే నెపంతో చిత్తిరి శ్రీదేవిని కులం పేరుతో దుర్భాషలాడి కర్రలతో దాడిచేశారు. అప్పుడు కొత్తగా వచ్చిన సబ్డివిజన్ పోలీసు అధికారికి ఈ దాడి విషయం ఫిర్యాదు చేయగా ఎస్సీ,ఎస్టీ యాక్ట్ 1989 కింద కేసు రిజిస్టర్ చేశారు. ముద్దాయిలను అరెస్టు చేసి రిమాండ్కు పంపించగా మూడోరోజు బెయిలు మీద వచ్చి మా మీదనే కేసులు పెడతారా అని మాలపల్లెలో మూడు నాలుగు శాల్తీలు లెస్తేకానీ, భూములు వదిలి, ఊరు వదిలి వెళ్లరని బెదిరించారు.
పథకం ప్రకారం దాడి:
కాపులతో సమానంగా ఆర్థికంగా,రాజకీయంగా ఎదుగుతున్న మాలలను సహించని కాపులు వారిపై పథకం ప్రకారం దాడిచేయడానికి కాచుకొని కూర్చున్నారు. రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికలు వారికి ఆ అవకాశాన్ని తెచ్చి పెట్టాయి. గ్రామంలో అడపదడప కాపులకు, మాలలకు భూమి కోసం గొడవలు జరుగుతూ ఉంటే 6 నెలల క్రితం పోలీసులు పికెటింగ్ ఏర్పాడు చేశారు. కానీ జూన్ 12న నరసన్నపేట ఉప ఎన్నికల దృష్ట్యా లక్షింపేట గ్రామంలో జూన్ 11 ఉదయం ఉన్న పోలీసు పికెట్ను ఎత్తివేశారు. ఈ అవకాశం కోసమే ఎదురుచూస్తున్న కాపులు 11వ తేదీ రాత్రి చుట్టుపక్కల గ్రామాల తూర్పు కాపులను మూడు ఆటోలలో, ఒక ట్రాక్టర్లో లక్షింపేటకు తరలించారు. బాంబులు, కత్తులు, బడిసెలు, శూలాలు, గొడ్డలు, కారం తదితర మరణాయుధాలను సమకూర్చుకున్నారు. పక్కా పథకం ప్రకారం 12వ తేదీ ఉదయం 7 గంటల ప్రాంతంలో సద్ది అన్నం తిని పనికి వెళ్లడానికి సిద్ధమౌతున్న మాలలపై పాశవికంగా దాడికి పాల్పడ్డారు. మాలపల్లెపై ఈ మూకుమ్మడి దాడిని గమనించిన ఊరి సర్పంచు చిత్తిరి సింహాలమ్మ భర్త గంగులు వంగర పోలీసు స్టేషన్కు సమాచారం అందించారు. కానీ లక్షింపేటకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న వంగర పోలీసులు సరైన సమయంలో స్పందిచకపోవడంతో దీనికి అవకాశంగా తీసుకున్న కాపులు పథకం ప్రకారం గ్రూపులుగా విడిపోయి మాలపల్లెను నాలుగు వైపుల నుంచి చుట్టు ముట్టి దాడికి పాల్పడ్డారు. మాలలను భయభ్రాంతులను చేసేందుకు మొదట బాంబులు వేయడంతో మాలలు భయపడి ఇంట్లోకి పారిపోయారు, పారిపోతున్న మాలలపై కాపులు వెంటాడి, దాడి చేసి మారణహోమం సృష్టించారు. ఈ దాడిలో కాపులకు తోడుగా వారి స్త్రీలు,పిల్లలు కారం పొడి ,రాళ్లను అందిచి పాశవికానందం పొందారు. దాదాపు నాలుగు గంటలపాటు తూర్పు కాపులు బరిసెలతో, బండరాళ్లతో,గొడ్డల్లతో దళితులపై పాశవికంగా దాడి చేశారు. ఈ మారణకాండలో నివర్తి సంగమేశు, నివర్తి వెంకట్రావు, బురాడ సుందర్రావు, చిత్తిరి అప్పడు అక్కడిక్కడే మరణించారు. దాడిలో తీవ్రంగా గాయపడి రెండు కళ్లుపోయి, మూత్రపిండాలు ఛిద్రమై విశాఖలోని కెజిహెచ్లో చికిత్స పొందుతూ వారం రోజుల తర్వాత బొద్దూరి పాపయ్య మరణించాడు. ఈ హంతక డాడిలో 20 మంది తీవ్రంగా గాయపడి కాళ్లూ, చేతూలూ విరిగిపోయి, తలలు పగిలి, పిల్లలు, వృద్దులు, స్త్రీలు, పురుషులు జీవశ్చావాల్లా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దాడితో గాయపడి మరణించిన నివర్తి సంగమేష్ 43 కత్తిపోట్లకు గురయ్యాడని డాక్టర్ రిపోర్టులో రాశాడంటే దుండగులు పథకం ప్రకారం ఎంత నరమేధం సాగించారో అర్థంచేసుకోవచ్చు. నాలుగు గంటలపాటు కాపు హంతకముటా చేసిన పాశవిక దాడిలో లక్షింపేట దళితవాడ రక్తపు మడుగుతో నిండిపోయింది. తమపై కాపులు దాడిచేస్తున్నారని సర్పంచు భర్త చిత్తిరి గంగులు ఉదయం 7 గంటలకు పోలీసులకు సమాచారం ఇస్తే పోలీసులు ఈ నరమేధం ముగిసాకా మధ్యాహనం 12:30 గంటలకు ఆ గ్రామానికి తాపీగా చేరుకున్నారు.
ఒక మాల కులానికి చెంది కొండ్రు మురళి ఎమ్మెల్యే మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో తన కులానికే చెందిన ప్రజలు తూర్పుకాపుల పాశవిక నరమేధానికి గురయ్యారు. దళితుల ఓట్లతో గెలిచి మంత్రిగా కొనసాగుతున్న కొండ్రు మురళి వారికి అండగా ఉండాల్సిందిపోయి అధికార పార్టీకి దళారిగా వ్యవహరిస్తూ కాపుకుల దురంకారులకే కొమ్ముకాస్తూ తన పదవిని కాపాడుకోవటానికే పరిమితమయ్యాడు తప్పా లక్షింపేట దళితుల సమస్యను చొరవతీసుకొని పరిష్కరించేందుకు, వారికి అండగా నిలిచేందుకు ప్రయత్నించలేదు.
దళితులపై జరుగుతున్న సాగుతున్న ఈ దాడులకు మూలం భూమి సమస్యతో ముడిపడి ఉంది. దళితులంతా మెజారిటీగా గ్రామీణ ప్రాంతాల్లో భూమిపై ఆధారపడి వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. ఈ భూమిపై హక్కు, అధికారం కలిగివున్నవారంతా ప్రధానంగా అగ్రకుల పెత్తందారీ భూస్వామ్య వర్గంగాను, అధికార రాజకీయ పలుకుబడి గలవారుగానూ ఉన్నారు. కనుక గ్రామీణ ప్రాంతంలో భూస్వామ్య, అగ్రకుల పెత్తందార్ల అధికారానికి, అహంకారానికి మూలమైన, ప్రధాన ఉత్పత్తి సాధనమైన భూమిపై హక్కు సాధించకుండా దళిత సమస్యలకు మౌళిక పరిష్కారం లేదు. ప్రభుత్వాలు ప్రవచించే 'భూసంస్కరణలు' వంటివేవీ భూసంబంధాల్లో మార్పులు తీసుకురావని, తీసుకురాలేవని రుజువైన వాస్తవం. దున్నేవానికి భూమి నినాధంగా వ్యవసాయక విప్లవం ఇరుసుగా దళితులపై జరిగే దాడులకు, అంటరానితరాన్ని సమూలంగా పరిష్కరించగలుగుతుంది. దళితులపై దాడులకు , అణచివేతకు వ్యతిరేకంగా సాగే ఉద్యమాలు, తక్షణ డిమాండ్ల సాధనతో పాటు ఈ దాడులకు మూలమైన వ్యవస్థపై ఎక్కుపెట్టే దిశగా సాగాలి.
(ఈ వ్యాసం రచయిత లక్షింపేట బాధితులను సందర్శించాక రాయబడింది.)
Subscribe to:
Post Comments
(
Atom
)


No comments :
Post a Comment