అప్జల్‌ ఉరి వేస్తున్న ప్రశ్నలు

No comments

ఢిల్లీలో పన్నేండు సంవత్సరాల క్రితం 2001 డిసెంబర్‌ 13న ఐదుగురు సాయుధులు పార్లమెంట్‌పై దాడి జరిపారు. తీవ్రవాదులు జరిపిన దాడిలో 8 మంది జవాన్లు, ఒక పార్లమెంట్‌ ఉద్యోగి చనిపోయారు. కొంతమంది గాయపడ్డారు. ఈ నేరానికి పాల్పడిన 5 మంది తీవ్రవాదులను పార్లమెంట్‌ భద్రతా జావాన్లు కాల్చి చంపారు. ఈ దాడిలో తీవ్రవాదులకు సహకారం అందించాడనే కారణంతో మూడు రోజుల తర్వాత మహమ్మద్‌ అప్జల్‌ గురు అనే కాశ్మీరినీ, ఢిల్లీ ప్రొఫెసర్‌ ఎస్‌.ఎ.ఆర్‌.జిలానీని, శ్రీనగర్‌ పండ్ల వ్యాపారి షౌకత్‌ను అరెస్టు చేశారు. కింది కోర్టు జిలానీని,షౌకత్‌ను నిర్దోషులని తేల్చడంతో వాళ్లు శిక్ష నుంచి తప్పించుకున్నారు. 2 సంవత్సరాల విచారణ ప్రక్రియ తర్వాత 2002 డిసెంబర్‌లో న్యాయస్థానం అప్జల్‌కు మరణశిక్ష విధించింది. ఆ కేసుపై తరువాత హైకోర్డులోనూ, సుప్రీం కోర్డులోనూ అప్పీలు చేసుకున్నారు. సుప్రీంకోర్డు 2005 ఆగస్టులో ఆ శిక్షను సమర్థించిన అనంతరం  చివరి అవకాశంగా అప్జల్‌ తరపున భార్య 2006 అక్టోబర్‌లో రాష్ట్రపతికి క్షమాభిక్ష దరఖాస్తును పంపారు. రాష్ట్రపతి 2013 ఫిబ్రవరి 3న ఆ దరాఖాస్తును నిరాకరించడంతో. ఆ తర్వాత ఐదు రోజుల తేడాతో ఫిబ్రవరి 9న ఉదయం 8 గంటలకు జైల్లో ఉరితీశారు. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జి పదవి బాధ్యతలు స్వీకరించాక  అమలులోకి వచ్చిన రెండో ఉరిశిక్ష ఇది. ప్రతిభాపాటిల్‌ తన పదవి కాలంలో తీసుకోని నిర్ణయాన్ని ప్రణబ్‌ముఖర్జీ  అతి తక్కువ కాలంలోనే రెండు దరఖాస్తులను తిరస్కరించడం  బహుషా రికార్డుగా నమోదు చేయోచ్చేమో? అప్జల్‌ ఉరిని రహస్యంగా నిర్వహించడాన్ని తప్పుపడుతూనే దేశంలోని వామక్ష పార్టీలనీ ఉరిశిక్షను పరోక్షంగా సమర్థించాయి. ఈ చట్టబద్ద హత్యకు దేశంలో చాలామంది  ఆనందోహాత్సహాలతోస్పందించి ఉత్సవంగా జరుపుకున్నారని ప్రచార సాధనాల తెలుస్తోంది. ప్రతి నేరానికి ఉరిశిక్షే పరిష్కారం అని భావిస్తున్న ప్రజలనుంచి బహుషా మనం ఇంతకంటే వేరే స్పందనను ఆశించలేము. పాలక వర్గాలు ప్రజలనుంచి ఆశిస్తున్నది కూడా ఇదే.

నిజానికి స్వతంత్య్ర భారతదేశంలో ఉరిశిక్షలు కొత్తేమి కాదు. అత్యధిక కాలం దేశాన్ని పాలించిన కాంగ్రెస్‌కు ఉరిశిక్షలను అమలుచేయడం కూడా కొత్త కాదు, గతంలో ఇదే పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కూడా ఉరిశిక్షను అమలు చేసింది. అయితే ఇక్కడ గతంలో అమలు చేసిన ఉరిశిక్షకు నేడు కసబ్‌, అప్జల్‌ గురి ఉరిశిక్షలను అమలు చేసిన విధానంలో తేడా ఉంది. 24 ఏళ్ల క్రితం ఇదే జైల్లో మాజీ ప్రధాని ఇందిరాను హత్య చేసిన నేరస్తులను నాటి ప్రభుత్వం 1989 జనవరి 6న తీహార్‌ జైల్లో ఉరితీశారు. ఒక దశాబ్దం పాటు అతలాకుతం చేసిన ఉగ్రవాద కోరల్లోంచి పంజాబ్‌ అప్పటికింకా పూర్తిగా బయటపడలేదు అయినా భారత్‌ ప్రజాస్వామ్యం పట్ల అకుంఠిత విశ్వాసాన్ని కనబరిచింది. ఇందిర హంతకులకు రాష్ట్రపతి క్షమాభిక్ష తిరస్కరించిన విషయాన్ని రాజీవ్‌ ప్రభుత్వమేమీ దాచి పెట్టలేదు. క్షమాభిక్ష తిరస్కృతిపై ఆ ఇద్దరూ నేరస్తులు సుప్రీం కోర్టుకెళ్లారు. కోర్డు వారి అభ్యర్థనను తిరస్కరించింది. ఆ తరువాతే వారి ఉరిశిక్ష తేదీని ప్రకటించారు. ఆ విషయాన్ని ముందుగానే వారి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. జైలులోనే కడసారిగి కుటుంబ సభ్యులు కలుసుకొని తుది వీడ్కోలు పలికారు. ఆ విషయాలన్నీ బహిరంగంగానే జరిగాయి. నాడు నేరస్తులను కోర్టుచేత రుజువుచేయబడిన వారిని ఉరితీసింది కాంగ్రెస్‌ ప్రభుత్వమే నేడు అప్జల్‌ను  ఉరితీసింది. కానీ అప్పుడు పాటించిన కనీసం సంప్రదాయాన్ని కూడా కాంగ్రెస్‌ పార్టీ పాటించకపోవడమే అనుమానాలకు తావిస్తోంది. ఉరి తీయడానికి ఎంచుకున్న సమయం కూడా పలు అనుమానాలకు ఆస్కారమిస్తోంది. యుపిఎ ప్రభుత్వం తన మనుగడ కోసమే ఇంత ఆదరాబాదరగా దీనిని అమలులో పెట్టిందనే విమర్శను కూడా ఆ కోణంలో ఆలోచించాల్సి వస్తుంది. 2005లోనే అప్జల్‌ గురు రివ్యూ పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించగా ఐదేళ్ల పాటు గమ్మున ఉన్న ప్రభుత్వం ఇప్పుడే ఎందుకు  హడివిడి చేసిందనేది ఆలోచించాలి. ఇంకోవైపు ఈ ఏడాది అనేక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున తన ప్రత్యర్థి బిజెపి నుంచి విమర్శలను తిప్పికొట్టేందుకే అప్జల్‌ గురును ఇప్పుడు హడావిడిగా ఉరితీసినట్లుంది. ఉగ్రవాదంపై కాంగ్రెస్‌ మెతక వైఖరి అవలంబిస్తోందని విమర్శించే బిజెపి నోర్మూయించేందుకు దీనిని ఒక సాధనంగా ఉపయోగిచుకున్నట్లు ఉంది. 

అయితే అప్జల్‌గురు ఉరితీయడం న్యాయమని చట్టబద్దమని ప్రభుత్వం విశ్వసిస్తే ఆ పని అంత రహస్యంగా జరపాల్సిన అవసరం లేదు. బతికున్నప్పుడు అప్జల్‌ నేరాలు చేశాడు కాబట్టి ప్రభుత్వ ఆధినంలో ఉండటంలో తప్పులేదు. కానీ అతను చనిపోయాక అతని శవంపై ప్రభుత్వానికి అధికారంలేదు. రహస్య నిర్వహన సమర్థతకు సంకేతం అనుకోవడం దురదృష్టకరం. జైల్‌ మాన్యువల్‌ ప్రకారం కూడా గురు కుటుంబానికి మరణ శిక్ష అమలు లేదిని సమయాన్ని తెయజేయడం బాధ్యత. అంతే కాకుండా వ్యక్తి మరణించిన తరువాత మృతదేహానికి జరపాల్సిన అంతిమ సంస్కారాలు కూడా అతని కుటుంబానికి చెందిన మతపరమైన సొంత బాధ్యత. ఈ బాధ్యతను కూడా ప్రభుత్వం తన సొంత వ్యవహారంగా చేయడాన్ని సమర్థనీయం కాదు. మరణశిక్ష నుంచి జీవితఖైదుగా మార్చమని అప్జల్‌ గురు తరపున అతని భార్య కోరితే రాష్ట్రపతి ఎందుకు తిరస్కరించారో తెలుసుకోవలసిన అధికారం ఆమెకూ, అతనికీ కూడా ఉంది. తిరస్కరించడానికి చూపిన కారణాలను సమీక్షించాలని సుప్రీంకోర్టును అడిగే హక్కు ఉంది. కొందరికి ఈ అవకాశం కల్పించడం మరికొందరికి నిరాకరించడం న్యాయం కాదు. అతి పెద్ద ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటున్న పాలకులు తను చేసుకున్న చట్టాలను కూడా తుంగలో తొక్కి అప్రజాస్వామికంగా వ్యవహరించడం సరైనది కాదు. 

అప్జల్‌ గురు అరెస్టు చేసినది మొదలు ఉరిశిక్షను అమలు చేసే వరకు అతని పట్ల ప్రభుత్వం చట్ట వ్యతిరేకంగా, కృరంగానే  వ్యవహరించింది. పర్వేజ్‌ బుఖారి అనే ఫ్రిలాన్స్‌ జర్నలిస్టుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో డిఎస్పీ దావిందర్‌ సింగ్‌ అనే ఇంటరేషన్‌ అధికారి మాట్లాడుతూ అతని అరెస్టు ఎక్కడా ఏ పుస్తకకంలో కూడా మేము నమోదు చేయలేదని, తన క్యాంపుల్లోనే అప్జల్‌ను చిత్రహింసలు పెట్టినట్లు అతని జననాంగాల్లో పెట్రోల్‌ పోశామని, కరెంట్‌షాకులు ఇచ్చామని అయినా అతనితో ఏమీ చెప్పించలేకపోయానని చెప్పాడు. నాకు హింసించి నేరాలు ఒప్పించడంలో చాలా పేరుంది. నా ఇంటరాగేషన్‌ తరువాత కూడా ఏమీ చెప్పడానికి లేకపోతే అతను ఏమీ చేయనట్టే. అతను నేరస్తుడుకాడని మొత్తం డిపార్ట్‌మెంట్‌ ఒప్పుకుంటుంది అని దావిందర్‌ సింగ్‌ చెప్పాడు. ఒకవైపు అప్జల్‌ను ఇంటరాగేషన్‌ చేసిన అధికారే పత్రికా ముఖంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అప్జల్‌కు సంబంధించిన వాస్తవాలను చెబుతుంటే ఇంకోవైపు అప్జల్‌ గురు పార్లమెంట్‌పై దాడికి కుట్ర పన్నాడని ప్రాసిక్యూషన్‌ నిరూపించలేకపోయింది అంటూ  పార్లమెంట్‌ తన తీర్పును ప్రకటించింది. అయినా ప్రభుత్వం అతనికి ఉరితీసింది ఇక్కడే ప్రభుత్వం యొక్క నిజాయితిని శంకించాల్సి వస్తోంది రాష్ట్రపతి క్షమాభిక్ష దరాఖాస్తును తిరస్కరించిన సందర్భంలో ప్రభుత్వం అతనిని న్యాయస్థానానికి కూడా దరఖాస్తు చేసుకునే వీలు కల్పించకుండా ఆగమేఘాలమీద ఉరితీయడం ప్రజాస్వామ్యాన్ని అపహాసుపాలు చేయడమే అవుతుంది. 

ఇదే సందర్భంలో నేరస్తుల పట్ల ప్రభుత్వ వైఖరిని కూడా ప్రశ్నించాల్సి ఉంది. లాహోర్‌లోనూ, పైసలాబాద్‌లోనూ వరుస బాంబు పేలుళ్ల కేసులో సరబ్‌ జిత్‌ నేరస్తుడని పాకిస్తాన్‌ న్యాయస్థానాలు నిర్థారించి 1991లోనే మరణశిక్ష  విధించాయి. కానీ ఆ మరణ శిక్ష అమలులోకి రాలేదు. సరబ్‌జిత్‌కు క్షమాభిక్ష పెట్టాలని, వదిలెయ్యాలని, భారత ప్రభుత్వం పాకిస్తాన్‌ ప్రభుత్వంతో రాజభారాలు నడుపుతోంది.  దేశానికి చెందిన ఇద్దరు వ్యక్తులు (సరబ్‌జిత్‌, అప్జల్‌) ఇరుదేశాల్లో నేరానికి పాల్పడారని ఇరుదేశాలకు చెందిన అత్యున్నత న్యాయస్థానాలు నిర్ధారించి శిక్షలు అమలు చేయాలని కోరితే, ఒకరి విషయంలో క్షమాభిక్ష పెట్టాలనీ భారత ప్రభుత్వం రాజభారం నడిపి తనూ మాత్రం క్షమా భిక్షను తిరస్కరించడం ఏవిధంగా అర్థం చేసుకోవాలి. ఇది ప్రభుత్వ ద్వంద్వ ప్రమాణం కాదా? ఈ రెండు కాసేపు పక్కన పెట్టిన తీవ్రవాదులు భారత పార్లమెంట్‌పై దాడికి పాల్పడి కాలంలోనే గుజరాత్‌లో ముఖ్యమంత్రి నరేంద్రమోడి  అధికారం సాక్షిగా దాదాపు మూడు వేల మందిని పొట్టన పెట్టుకొని భారతదేశ లౌకికత్వాన్ని ప్రశ్నిస్తే ఊచకోతకు కారణమైన నరేంద్రమోడిని శిక్షించలేని న్యాయస్థానాన్ని, ప్రభుత్వ ఉదసీనవైఖరిని ఎలా అర్థం చేసుకోవాలి. 1993లో జరిగిన ముంబై అల్లర్లకు వెయ్యి మంది చనిపోవడానికి ప్రధాన కారణం బాల్‌ఠాక్రే రచనలు, శివసైనికులకు ఆయన చేసిన 

ఉద్భోదలేనని బి.ఎస్‌ కృష్ణ న్యాయ విచారణ కమీషన్‌ నిర్ద్వందంగా ప్రకటించినా ఏనాడు బాల్‌ఠాక్రేపై ఒక్క కేసు నమోదు చేయని పాలక పక్షాన్ని, న్యాయవ్యవస్థను యొక్క పక్షపతాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. ఒకవైపు గుజరాత్‌లో మూడువేల మంది సామన్యుల ఉచకోతకు కారణమైన వ్యక్తిని దేశానికి భావి ప్రధానిగా అభివర్ణిస్తుంటే, ఇంకోవైపు వేలాదిమంది మరణాలను కారకులైన వ్యక్తికి ప్రభుత్వంలోని వ్యక్తులు  సంతాప సందేశాలు పంపడాన్ని ఏవిధంగా చూడాలి. ఇలాంటి చర్యల ద్వారానే ప్రభుత్వమంటే కేవలం మెజారిటి పక్షాలకు చెందిందే అనే అభిప్రాయం సామాన్యుల్లో కలిగే అవకాశం ఉంది. 

అప్జల్‌ గురు గతంలో ఒక పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ ఉగ్రవాద మూలాల గురించి ఒక కాశ్మీరీగా తన విశ్లేషన చేశాడు. ఆయన ఇంటర్వ్యూలోని భావాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకునుంటే కొంతవరకైన ఉగ్రవాద దాడులను అరికట్టగలిగేది. అప్జల్‌ ఆ ఇంటర్వ్యూలో భారత ప్రభుత్వం ఉగ్రవాదులను అరికట్టే పేరుతో తన భద్రతా దళాల ద్వారా పాల్పడుతుందని తెలిపాడు. రాజ్య ఉగ్రవాదం గురించి, ముఖ్యంగా ఎస్టీఎఫ్‌, స్పెషల్‌ ఆపరేషన్స్‌ గ్రూప్‌ (ఎస్‌ఓజీ) వాళ్లు చేస్తున్న ఆరాచకాల గురించి ఎవరూ పట్టించుకోవట్లేదని, ఈ రాజ్య ఉగ్రవాదమే నాలాంటి వాళ్లను ప్రతిరోజు తయారు చేస్తోందని నిజాయితిగా ఒప్పుకున్నాడు. అమాయకులైన టీనేజీ విద్యార్థులను ప్రజా భద్రతా చట్టం లాంటి క్రూర చట్టాల కింద అరెస్టు చేసి జైళ్లలో పడేస్తోందని, ఈ రాజ్య ఉగ్రవాదం ఉన్నంత కాలం ఇలాంటి దాడులకు ఎవరూ అపలేరని, భారత ప్రభుత్వమే కాశ్మీర్‌ను మినీ ఆప్ఘనిస్తాన్‌లా తయారుచేసిందని విమర్శించాడు. ప్రస్తుతం కాశ్మీర్‌లో పరిస్థితి అచ్చం ఆప్ఘన్‌లోలాగానే ప్రమాదంగా ఉందని, ఈ అగ్ని పర్వతం ఎప్పుడో ఒకప్పుడు పేలుతుందని, ఇది హెచ్చరిక కాదని భారత ప్రజలతో పాటు కాశ్మీర్‌ ప్రజల గురించిన ఆవేదన మాత్రమే, కాశ్మీరీలు ఎప్పుడూ భారతీయులకు వ్యతిరేకం కానే కారు. ప్రభుత్వ విధానాలే కాశ్మీరీ ప్రజలను భారతదేశం నుంచి వేరుచేశాయి. దీనికి పరిష్కారం కాశ్మీర్‌లోనే ఉంది తప్పా పాకిస్థాన్‌లో కాదని తెలిపాడు. ఇంత వివరంగా ఒక కాశ్మీరీ పౌరుడు దేశం ముందు ఉగ్రవాదానికి సంబంధించిన సమస్యను ఉంచితే పాలకులు మళ్ళీ తన రాజకీయ లబ్ది కోసం సమస్యలను జఠిలం చేస్తూ పోతే పరోక్షంగా ఉగ్రవాదాన్ని ప్రభుత్వమే పెంచి పోషించినట్లవుతుంది. పాలకులు తమ సమస్యలను పరిష్కరించడంలో చిత్తసుద్దిని ప్రదర్శించుండా సమస్యను ఇంకా క్లిష్టతం చేస్తూ  సామాన్యుల జీవితాలతో చెలగాటమాడుతోంది. ప్రజాస్వామ్యానికి మూలస్తంబమైన అత్యంత భద్రతలో ఉన్న పార్లమెంట్‌పై దాడి జరిగిన తర్వాతనైనా సమస్య మూలాలలోకి వెళ్ళి పరిష్కారం కనుగొనాలి. 

నేరానికి పాల్పడిన వారిని ఉరితీస్తే సమస్య పరిష్కారం అవుతోందని పాలకులు, సామాన్యులు భావిస్తున్నారు. పాలకులు కూడా ఇలాంటి క్రూరమైన శిక్షలనే అమలుచేస్తోంది. కానీ కఠినమైన శిక్షల ద్వారా నేరాలు తగ్గినట్టు ఎక్కడా ఆధారాలు లేవు. ప్రపంచ వ్యాపితంగా అనేక దేశాల అనుభవం కూడా ఇదే చెబుతోంది. నేరస్తుడు అమాయకుల ప్రాణాలు తీసుకున్నాడు కాబట్టి చట్టబద్దంగా రాజ్యమే నేరస్తున్ని క్రూరంగా శిక్షించాలనడం అటవిక న్యాయమై అవుతోంది. నేరానికి శిక్ష మరణమే అని వాదిస్తే నేరస్తుడికి, సభ్య సమాజానికి, చట్టబద్ధ రాజ్యానికి ఏం తేడా వుండదు. ప్రతి నేరానికి ఉరిశిక్ష వేయండి అని అడిగే ఈ దేశ ప్రజలు అభద్రత భావంతో ఎక్కడో తన మానవత్వాన్ని కోల్నోతున్నట్టు అనిపిస్తోంది. కంటికి కన్ను, పంటికి పన్ను అని ప్రతి ఒక్కకూ అనుకుంటే మొత్తం సమాజమే గుడ్డిదై పోతుందని మహాత్మగాంధీ గారు మరణశిక్షనుద్దేసించి ఒక సందర్భంలో అన్నారు. గాంధీ విలువలపైనే పార్టీని, ప్రభుత్వాన్ని నడుపుతున్నామని చెప్పుకుంటున్న కాంగ్రెస్‌ పాలకులు కనీసం ఆయన మాటలనైనా ఆచరిస్తే బావుండు.

No comments :

Post a Comment