మహిళలపై అత్యాచారాలు: చట్టం - పురుష్యాధిక్య భావజాలం
(ముంబై శక్తి మిల్ అత్యాచార ఘటనకు నిరసనగా అందోళన నిర్వహిస్తున్న జర్నలిస్టులు, ఉద్యమకారులు)
దేశంలో మహిళలపై, బాలికలపై అత్యాచారం జరగని రోజు లేదు. ఈ మధ్య కాలంలో అయితేే ఈ ఘటనలు ఆందోళన కలిగించే స్థాయిలో జరుగుతున్నాయి. అయితే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు బాధ్యులను కఠినంగా శిక్షించాల్సిన ప్రభుత్వాలు, ప్రభుత్వలో ఉన్న పెద్దలు అత్యాచారాలు జరగడానికి మహిళలే కారకులంటూ నెపాన్ని వారిపైనే నెట్టేయ్యడానికి ప్రయత్నిసున్నారు. దాంట్లో భాగమే సమాజ్వాదీ నేత మూలయం సింగ్ యాదవ్ ''అబ్బాయిలు అబ్బాయిలే, వారు తప్పు చేస్తారు'' దానికి కారణం అమ్మాయిలే అని ముంబై శక్తి మిల్స్ అత్యాచార నిందితులను వెనకేసుకొస్తూ మాట్లాడాడు.
ఢిల్లీ మెడికో విద్యార్థిని(నిర్భయ అనబడే జ్యోతిసింగ్ పాండే)పై జరిగిన క్రూరమైన అత్యాచారం తర్వాత దేశ వ్యాప్తంగా మహిళల భద్రతపై పెద్ద ఎత్తున ఆందోళన మొదలైంది. అంతే స్థాయిలో తీవ్ర చర్చను కూడా లేవనెత్తింది. మెడికో విద్యార్థినిపై జరిగిన అత్యాచారమే, ఈ దేశంలోని మహిళలపై జరిగిన మొదటి అత్యాచారం కానప్పటికీ, అత్యాచారబాధితురాలికి అండగా మధ్యతరగతి ప్రజలు, విద్యార్థులు, సెలిబ్రెటిస్, మీడియా పెద్ద ఎత్తున అండగా నిలిచారు. ఢిల్లీ అత్యాచార ఘటన కంటే ముందు ఈ దేశం మొత్తాన్ని కలవరపాటుకు గురిచేసిన సంఘటనలు అనేకం జరిగినప్పటికీ (ఉదా: కాశ్మీర్లోని కునర్ పుష్పోరా గ్రామంలో ఒకే రోజు 64 మంది మహిళలు పోలీసుల చేతిలో అత్యాచారానికి గురికావడం, అలాగే వాకపల్లి ఆదివాసీ మహిళలపై గ్రెహౌండ్ పోలీసుల అత్యాచారం మొదలైనవి)కార్పోరేటు మీడియా, మధ్యతరగతి జీవులనుండి, విద్యార్థులనుండి తగినంత వ్యతిరేకత,స్పందన రాలేదు. దీనికి అనేక కారణాలు ఉన్నాయనుకోండి. ఆ కోణాన్ని ఇంకో వ్యాసంలో చర్చించ వచ్చు కానీ నిర్భయ అత్యాచారం,మరణం తర్వాత దేశ వ్యాప్తంగా జరిగిన ఆందోళన ఫలితంగా కేంద్రప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కూడిన కమీషన్ను ఏర్పాటుచేసి చేతులు దులుపుకుంది. అయితే కేంద్రం అనుకున్న సమయంకంటే ముందుగానే జస్టీస్ వర్మ తన రిపోర్టును ప్రభుత్వం ముందు ఉంచి అనేక విలువైన అంశాలను రిపోర్టులో పొందపరిచాడు. జస్టీస్ వర్మ ఈ రిపోర్టులో పొందపరిచిన అంశాలను ప్రభుత్వం అనేకం ఆమోదించనప్పటికీ అత్యాచార నేరాలు అరికట్టేందుకు ''నిర్భయ'' పేరుతో ఒక చట్టాన్ని తీసుకొచ్చింది.
(జస్టీస్ వర్మ)
చాలా మంది ఈ చట్టం రావడం మూలంగా ఇక దేశంలో మహిళలపై నేరాలు తగ్గుముఖం పడతాయి అని భావించినప్పటికీ అదేమీ జరగకపోగా నేరాల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ చట్టాలను అపహాస్యం చేస్తున్నాయి. నిర్భయ చట్టం అమలులోకి వచ్చిన మరుసటి రోజు మన రాష్ట్రంతో సహా దేశ వ్యాప్తంగా 50 మంది మహిళలు అత్యాచారానికి గురైనట్లు అనేక స్వచ్ఛంద సంస్థల రిపోర్టులు చెబుతున్నాయి. స్త్రీల పట్ల పురుషాధిక్య సమాజంలో, భావజాలంలో మార్పు రాకుండా ఎన్ని చట్టాలు మహిళలపై జరుగుతున్న దాడులను, అత్యాచారాలను అరికట్టలేమని వర్తమాన చరిత్ర రుజువుచేస్తుంది.
ఆగని అత్యాచారాల పర్వం:
ఢిల్లీ ఘటన తర్వాత దేశంలోని అత్యధిక మంది మహిళలు, విద్యార్థులు, టీవీల ముందు ఊగిపోతూ నడిరోడ్డుమీద నిందితుల్ని ఉరితీస్తే తప్ప ఇట్లాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కావంటూ అభిప్రాయాన్ని వెళిబుచ్చారు. దాదాపు చాలా మంది అమ్మాయిలు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని చెప్పవచ్చు. అయితే కఠినమైన శిక్షలు విధించినంత మాత్రాన ఇటువంటి ఘటనలు ఆగిపోవనడానికి మన రాష్ట్ర అనుభవం ఒకటి ఇంకా మన కళ్లముందే ఉంది. 2009లో వరంగల్ విద్యార్థినిలైన స్వప్న, ప్రణితలపై యాసిడ్ దాడికి పాల్పడిన నిందితుల్ని పోలీసులు కాల్చిచంపినా, అటువంటి ఘటనలు మాత్రం ఆగకపోగా ఇంకా అనేకం ప్రతి నిత్యం జరుగుతున్నాయి. చాలా మంది అభిప్రాయం ప్రకారం చట్టాలు పఠిష్టంగా ఉంటేనో లేదా శిక్షలు కఠినంగా అమలు చేసినంత మాత్రాన నేరాలు తగ్గవని, బాహ్య పరిస్థితులు మారనంతవరకు అవి కొనసాగుతాయని ప్రతి నిత్యం ఏదో మూలన మహిళలపై జరుగుతున్న ఘటనలే సజీవ సాక్షం.
అదే ఘోరం! అదే క్రూరత్వం:
(ముంబై శక్తి మిల్ పాత భవనం)
నిర్భయ ఘటన తర్వాత చట్టాన్ని పఠిష్టం చేశామని, ఫాస్ట్ట్రాక్ కోర్టుల ద్వారా శిక్షలు త్వరగా అమలుచేస్తామని పాలకులు చెప్పుకొచ్చారు. ఈ దేశంలోని ఫాస్ట్ ట్రాక్ కోర్టులు వేగంగా పనిచేస్తున్నాయో లేదో గానీ అత్యాచారాల పర్వం మాత్రం రాకేట్ వేగంతో దూసుకెళుతుంది. దీనిని ఉదహరణగా మరో అత్యాచార ఘటనను చూడవచ్చు. దాదాపు ఢిల్లీ అత్యాచారం తరహాలోనే ముంబైలోని శక్తిమిల్లో, విధి నిర్వహణలో ఉన్న ఒక ఫోటో జర్నలిస్టు యువతిపై ఐదుగురు మృగాళ్ళు పైశాచిక తీరిలో అత్యాచారానికి ఒడిగట్టారు. ముంబై నగరంలో ఇటీవల కాలంలో పాత భవనాలు వరుసగా కూలీపోతు అనేక మంది కూలీలు మృత్యువాత పడుతున్నారు. 20వ శతాబ్దం ప్రారంభంలో ముంబైలోని బట్టల మిల్లుల్లో పనిచేసేందుకు గ్రామాల నుంచి వలస వచ్చిన ప్రజల కోసం ఈ భవనాలను నిర్మించారు. ఇలాంటి భవనాల్లో 10 నుండి 20 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇటీవల కాలంలో ఈ భవనాలు ఒక్కొక్కటిగా కూలీపోతు మృత్యు ద్వారాలుగా మారుతున్నాయి. ఈ భవనాల గురించి ఒక కథనాన్ని తయారుచేసేందుకు, ఒక ఆంగ్ల మ్యాగజైన్ కోసం ఫోట్లో జర్నలిస్టుగా పనిచేస్తున్న యువతి, స్నేహితునితో కలిసి వెళ్ళిన యువతికి ఘోరమైన అనుభవం ఎదుర్కొవాల్సి వచ్చింది. నిర్భయ విషయంలో జరిగినట్లే అక్కడ ఉన్న వ్యక్తులు యువతిపై అసభ్య వ్యాఖ్యలు చేయడంతో తోడుగా వెళ్లిన స్నేహితుడు వారించడంతో ఆ స్నేహితున్ని దుండగులు తీవ్రంగా చావబాదారు. ఇద్దరు వ్యక్తులు అతన్ని కట్టేసి కొడుతూ ఉంటే, మిగిలిస ముగ్గురు ఆమెను శక్తిమిల్స్ కాంపౌండ్లోనికి ఈడ్చుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టారు. బాధితురాలి శరీరంలో అంతర్గతంగా తీవ్ర గాయాలు అయినట్లు డాక్టర్లు పత్రికలకు తెలిపారు. బాధితురాలు ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి ఘటనను వివరించడంతో రాష్ట్రంలో పెద్దఎత్తున నిరసనలు మొదలయ్యాయి.
(ముంబై శక్తి మిల్ అత్యచార నిందితులు )
ఢిల్లీ ఘటన సందర్భంగా జరిగిన ఆందోళనల అనుభవం దృష్ట్యా, ముంబై పోలీసులు కాస్త వేగంగా స్పందిచడంతో ఐదుగురు నిందితుల్లో ఇద్దరిని వెంటనే అరెస్టు చేయగలిగారు. అయితే తన పట్ల జరిగిన మృగాల దాడికి తట్టుకొని నిలబడటమే కాకుండా నిందితులకి శిక్షపడేంత వరకు ఆమె పోరాటం నిర్వహించడంతో కోర్టు నిందితుల్లో ముగ్గురికి మరణశిక్షను విధించడం జరిగింది. నిందితులకు విధించిన మరణశిక్షపట్ల విభిన్న అభిప్రాయలు ఉన్నప్పటికీ ఈ తీర్పు సందర్భంగా ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జ్ శాలిని ఫన్సలర్స్ చేసిన వ్యాఖ్యానాలు తీవ్ర చర్చకు దారితీశాయి. తన తీర్పులో ''ముంబైలోని శక్తిమిల్స్ అత్యాచారం ఘటన ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటనకు ఏ మాత్రం తీసిపోనిదని'' వ్యాఖ్యానిస్తూనే చట్టాల పరిమితిని వివరించింది. ''నిర్భయ ఘటనకు సంబంధించిన ఆందోళన, పరితాపం ఇంకా చల్లబడకముందే ఈ ఘటన జరిగింది. కఠిన చట్టాలు రూపొందించినప్పటికీ, యువకులు ఇటువంటి క్రూరమైన, అమానవీయ ఘటనలకు పదే పదే పాల్పడుతున్నారని'' జడ్జి ఫల్సాలర్స్ అన్న మాటలు చట్టం యొక్క పరిమితిని ఎత్తిచూపడమే కాకుండా చట్టాల మూలంగా నేరాలు తగ్గుముఖం పడతాయన్న వాదన తప్పని రుజువుచేస్తున్నాయి. పౌరసమాజం ఏర్పడినప్పటి నుండి చట్టాలున్నాయి. రోజు రోజుకు పఠిష్టమతున్నాయి కాని నేరాలు మాత్రం అదుపులోకి రావడం లేదని చెప్పడానికి పై తీర్పు సందర్భంగా జడ్జి చేసిన వ్యాఖ్యానం సరిపోతుందేమో! చట్టాలు అనేవి మనిషి నేర ప్రవృత్తిని అదుపుచేయడానికి కొంత తోడ్పడతాయేమో కాని నేరాలు జరగకుండా నిరోధించలేకపోయాయని అనేక దేశాల అనుభవాలు మనకున్నాయి. జంతు ప్రపంచం నుండి ఇంకా పూర్తిగా బయటపడని మనిషిని చట్టాల మూలంగా సంస్కరించలేమని తేలిపోయింది. మందు మనిషి సంస్కరింపబడాలి. అంటే సంస్కారం నేర్పే సమాజం రావాలి. అంతవరకు ఈ నేరాలకు ఇప్పుడున్న సమాజమే బాధ్యత వహించాల్సి ఉంటుందనేది గుర్తించాలి.
పురుష్యాధిక్య భావజాలం:
''అబ్బాయిలు అబ్బాయిలే, వారు తప్పు చేస్తారు'' ఇవి సమాజ్ వాదీ పార్టీ నాయకుడు ములాయం సింగ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడిన మాటలు పెను దుమారానికి తెరతీశాయి. ముంబై శక్తి మిల్స్ అత్చారా నిందితుల్లోని ముగ్గురికి కోర్టు మరణ శిక్ష విధించిన నేపధ్యంలో సమాజ్ ఈ వ్యాఖ్యలు వెలిబుచ్చిన మాటలివి. ఈ మాటలు ఆయన పొరపాటుగా అన్న మాటలు కావనీ, రాజకీయ ప్రయోజనాల కోసమే అన్నారని చాలామంది విశ్లేషకులు, పత్రికలు వ్యాఖ్యానించినప్పటికీ ప్రొ రేపిస్టు లాబీ ఒకటి మన దేశంలో ఉందని చెప్పడానికి ములాయం సింగ్ మాటలు నిదర్శనం. ములాయం అంతటితోనే ఆగకుండా 2012లో ఢిల్లీ నగరంలో నిర్భయ అత్యాచారానికి, హత్యకు గురైన అనంతరం వచ్చిన కొత్త అత్యాచార చట్టాలను దుర్వినియోగం చేస్తూ తమ బాయ్ ఫ్రెండ్స్ను శిక్షించడానికి ఉపయోగిస్తున్నారని వ్యాఖ్యానించాడు. ''వారి స్నేహం ముగిసిపోయినపుడు తాను అత్యాచారానికి గురయ్యానని అమ్మాయి ఫిర్యాదు చేస్తుందని'' మహిళలపై ఘోరమైన నిందారోపన చేశాడు. ములాయం సింగ్కు మహిళల పట్ల ఉన్న అభిప్రాయం ఇదైతే, ఆయన అనుయాయి అసిమ్ అజ్మీ మాత్రం మూలాయం కంటే రెండాకులు ఎక్కువ చదివినట్లున్నాడు. ''ముంబాయ్ వార్త పత్రికతో మాట్లాడుతూ 'ఏ మహిళ అయినా సరే, వివాహిత అయినా కాకపోయినా, తన అనుమతి ఉన్నా లేకపోయినా, ఒక పురుషుడితో వెళితే గనుక ఆమెను ఊరి తీయాలి'' వ్యాఖ్యానించాడు. విచారించదగ్గ విషయం ఏమిటంటే ఇటువంటి ధోరణులు కేవలం సమాజ్ వాదీ పార్టీకి మాత్రమే పరిమితం కావు. "స్కూల్ అమ్మాయిలు గౌనులు వేసుకుంటున్నందున వారిపై అత్యాచారాలు జరుగుతున్నాయ"ని భావిస్తున్న రాజస్థాన్ శాసన సభ్యుడి నుండి అమ్మాయిలు తమను తాము ఓవర్ కోట్తో కప్పుకోవాలని కోరే పుదుచ్చేరి మంత్రి వరకూ అందరూ పురుష్యాధిపత్య భావజాలంతోనే ఈరకమైన కామెంట్లు చేస్తున్నారు.
ఇవ్వాళ ఈ పురుష్యాధిక్య భావజాలం అనేది కేవలం పురుషులకు మాత్రమే పరిమితం అనుకుంటే పొరపాటే ఎందుకంటే ''దేశంలో జరుగున్న వరుస అత్యాచారాలకు కారణం స్త్రీలు,పురుషులు రాసుకుపూసుకు తిరగడమే కారణమంటూ" గతంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంతి మమత బెనర్జీ ఆరోపించడాన్ని గమనించాయి. దేశ వ్యాప్తంగా గత సంవత్సరం 24,003 అత్యాచార సంఘటనలు జరిగితే వాటిలో మైనారిటీ తిరని పసిపిల్లలపై 7058 అత్యాచారాలు జరిగినట్లు ఆ లెక్కలు చెబుతున్నాయి. అంటే అత్యాచార బాధితుల్లో 30 శాతం మంది పసిపిల్లలు ఉంటున్నారు. ఇక మన రాష్ట్రంలో గత సంవత్సరం 1442 అత్యాచార సంఘటనలు జరిగినట్లు పోలీసు రికార్డులు చెబుతుంటే వాటిలో 646 మంది బాధితులు పసిపిల్లలు ఉన్నారు. అంటే మన రాష్ట్రంలో దాదాపు 44.7 శాతం అత్యాచారాలు బాలికలపై, చిన్న పిల్లలపై జరిగినట్లు తెలుస్తోంది. మమతా బెనర్జీ గారు పరిపాలిస్తున్న రాష్టంలో గత సంవత్సరం మొత్తం 2363 మందిపై అత్యాచార ఘటనలు జరిగితే వాటిలో మైనారీటి తిరని 345 మంది పసిపిల్లలు వున్నారని జాతీయ నేర పరిశోధన విభాగం చెబుతుంది. మరి ఇంతమంది పసిపిల్లలు అత్యాచారానికి గురికావడానికి ఆ పిల్లలు ఎవరిని రాసుకుపూసుకు తిరిగారో ఆవిడే సెలవివాలి ఒక మహిళ ముఖ్యమంత్రి స్థాయిలో వుండి మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు ఇలాంటి చౌకబారు కారణాలు చెప్పడం భావ్వం కాదు.
దేశానికి దిశా నిర్ధేశం చేయాల్సిన ప్రజాప్రతినిధుల మాటలు ఈ విధంగా ఉంటే ఇక సమాజంలో ఎక్కడా న్యాయం జరగని ఆబల చివరకు న్యాయాన్ని వెతుక్కుంటా వెళ్లేది కోర్టు మెట్లు మాత్రమే అక్కడ కూడా పురుష్యాధిక్య భావాజాలం మహిళలను వెంటాడితే ఇక మహిళకు ఎక్కడ సమాధానం దొరుకుతుందనేది ప్రశ్నార్థంగా మారింది. శక్తిమిల్ అత్యాచార బాధితురాలి తరపున వాధించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ కోర్టులో మహిళ తరపున మాట్లాడుతూ ''అత్యాచారం అనేది మహిళ శరీరంపై దాడి మాత్రమే కాదు. ఆమె మనసు, శీలం, ప్రతిష్ట, ఆత్మగౌరవంలపై దాడి కూడా. బాధితురాలు చనిపోతే తప్ప ఆ గాయాలు మానిపోవు'' అని వ్యాఖ్యానించాడు.
(పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్)
అత్యాచారానికి గురయిన స్త్రీ చనిపోవడం తప్ప మరో మార్గం లేదని చెప్పే వాదన ఎంత ఘోరం. ఎంత లోపభూయిష్టం! స్త్రీల శీలం, పరువు ప్రతిష్టలు అత్యాచారం వల్ల పోతాయని చెప్పడం కంటే మించిన పితృస్వామిక ఆధిపత్య భావజాల వ్యక్తీకరణ మరోకటి ఉంటుందా? బాధితులకు తరపున వాదించాల్సిన పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, జడ్జీలు తమ నరనరాన పితృస్వామ్య భావాజాలం ఎంతగా నిండిపోతే ఇలాంటి వాఖ్యలు చేయగలరో అంచనా వేయవచ్చు. అత్యాచారం అనేది జీవితానికి తగిలిన ఒక బలమైన గాయం మాత్రమే. అంతమాత్రాన జీవితం అయిపోయినట్లు కాదు. పరువు ప్రతిష్టలు, శీలం పేరుతో ఆ గాయాన్ని పెద్దది చేసి బాధితురాలు కోలుకోకుండా చేసే ప్రతి ఒక్కటి ఆమె జీవితంపై పదే పదే జరిగే అత్యాచారాలు మాత్రమే. భూస్వామ్య, పితృస్వామ్య భావాలకు చెందిన ఈ మెదళ్లు మారితే తప్ప స్త్రీల మనసును అర్థం చేసుకోవడం సాధ్యం కాదు.
Subscribe to:
Post Comments
(
Atom
)
No comments :
Post a Comment